నేడు ఉరుములతో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో శనివారం అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఇదిలావుండగా శుక్రవారం ఆదిలాబాద్లో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్నిచోట్లా ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది.
వడదెబ్బతో నలుగురు మృతి
వడదెబ్బతో శుక్రవారం వేర్వేరుచోట్ల నలుగురు మృతి చెందారు. మృతుల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన రైతు అన్నేడి అనంతరెడ్డి (70), జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో నివాసముండే బోసు (60), నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన మండల వెంకమ్మ (102), యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన వీఆర్ఏ ఎలుక శంకర్(38) ఉన్నారు.