వర్షంపై మంత్రి కేటీఆర్ సమీక్ష


వెంటనే స్పందించిన కమిషనర్, మేయర్ బృందానికి కితాబు



సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురిసిన అకాల వర్షం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మునిసిపల్ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. పాలేరు ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లతో మాట్లాడి నగరంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ట్రాఫిక్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని దాదాపుగా తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు చెప్పారు. గాలి బీభత్సానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, వాటి పునరుద్ధరణ కూడా పూర్తిచేశామన్నారు.



నగరంలోని పరిస్థితులపై మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతోనూ మాట్లాడారు. నగరంలో 8 సెం.మీ.ల వర్షానికే ఇలాంటి పరిస్థితి  ఏర్పడిందన్న మంత్రి, ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయంతో ఒక శాశ్వత మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సీఎస్ రాజీవ్‌శర్మ వివిధ శాఖాధిపతులతో మాట్లాడి నగరంలో జరగుతున్న రోడ్లు, విద్యుత్, ట్రాఫిక్ పునరుద్ధరణ పనులను  సమీక్షించారు. వెంటనే స్పందించిన మేయర్,కమిషనర్లను ఆయన అభినందించారు

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top