‘కోటలో వేట’పై హరీశ్ సీరియస్
- సమగ్ర విచారణకు ఆదేశం
- విచారణకు ఆదేశించిన అటవీ శాఖ మంత్రి
సాక్షి, హైదరాబాద్: రిసార్టు ముసుగులో కొనసాగుతున్న అటవీ జంతువుల వేటపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ మేరకు ‘సాక్షి’లో ‘కోటలో వేటగాడు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. రిసార్టు కార్యకలాపాలు, అందులో కొనసాగుతున్న అటవీ జంతువుల వేటపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, నిజం నిగ్గు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రిసార్టులు, ఫాం హౌస్లలో జరిగే కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలని సిద్దిపేట సీపీ శివకుమార్ను ఆదేశించారు. ఇదే అంశంపై అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అటవీ జంతువులను ఎన్క్లోజర్స్ పెట్టి ఎలా బంధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.