సింగరేణిలో ప్రసూతి సెలవు పెంపు

సింగరేణిలో ప్రసూతి సెలవు పెంపు - Sakshi


ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాల అమలు  



సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో పనిచేస్తున్న మహిళా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం తీపికబురు అందించింది. మెటర్నిటీ (ప్రసూతి) సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలను అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.



సింగరేణి గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత కార్మికుల పక్షాన మెటర్నిటీ లీవ్‌లను పెంచాలని, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు పెంచాలని ఇటీవల సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. కవిత విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యాజమాన్యం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో 14,921 మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు లబ్ధి పొందుతారు. యాజమాన్యంపై నెలకు సుమారు రూ.2.07 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ సందర్భంగా సింగరేణి మహిళా ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.



సింగరేణి కార్మికులకు కనీస వేతనాలు

కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌లో పని చేస్తున్న నైపు ణ్యేతర, నైపుణ్య కార్మికులకు కనీస వేతనాలు వర్తించేలా కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర నిర్ణయంతో సింగరేణిలోని ఈ కేటగిరీకి చెందిన 1,200 మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నైపుణ్యేతర కార్మికుల వేతనం రోజుకు రూ.48కి పెరిగిందని, ఓ స్థాయి నిపుణులకు రూ.420, నిపుణులైన కార్మికులకు రూ.506, పూర్తి స్థాయి నిపుణులకు రూ.596 చొప్పున చెల్లిస్తారని తెలిపారు. 2017 జనవరి 19 నుంచి ఈ పెంపు వర్తిస్తుందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top