నన్నే టైం అడుగుతావా...
టైం అడిగినందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కత్తితో దాడి
హైదరాబాద్: టైం అడిగిన ప్రయాణికుడిపై సాధువు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన మహ్మద్ షరీఫ్ (50) గురువారం కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో వరంగల్కు వెళుతున్నాడు. రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆగగా.. షరీఫ్ ప్లాట్ఫాంపైకి వచ్చి అటుగా వస్తున్న సాధువును టైం ఎంతైందని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి నన్నే టైం అడుగుతావా అంటూ షరీఫ్పై కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చినికి చినికి గాలివానలా మారి ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలో షరీఫ్పై సాధువు కత్తితో దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా షరీఫ్ కింద పడిపోయాడు. అనంతరం ఆ సాధువు అక్కడి నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న షరీఫ్ను తోటి ప్రయాణికులు, పోలీసులు 108 అంబులెన్సలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం ఆలస్యంగా తేరుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.