రూ.3.49 లక్షలతో ప్రైవేటు ఉద్యోగి జంప్

రూ.3.49 లక్షలతో ప్రైవేటు ఉద్యోగి జంప్ - Sakshi


చిలకలగూడ (హైదరాబాద్): బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఇచ్చిన సొమ్ముతో ఉద్యోగి ఉడాయించిన సంఘటన హైదరాబాద్ నగరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్ వాకర్‌టౌన్‌కు చెందిన పి.ధర్మేందర్‌రెడ్డి స్థానికంగా కేవీకే వైన్స్ పేరిట మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇందులో బి.వెంకటరమణ (42) కొంతకాలంగా పనిచేస్తున్నాడు.



ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వైన్స్ యజమాని ధర్మేందర్‌రెడ్డి ఉద్యోగి వెంకటరమణకు రూ.3.49 లక్షలు ఇచ్చి మారేడుపల్లిలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు ఖాతాలో జమచేయాలని పంపాడు. వైన్‌షాపునకు చెందిన ద్విచక్ర వాహనంపై వెళ్లిన వెంకటరమణ ఎంత సేపటికీ తిరిగిరాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి విచారించగా ఖాతాలో సొమ్ము జమ కాలేదని తేలింది. దీంతో బాధితుడు ధర్మేందర్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి, వెంకటరమణ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top