నేను కట్టిన తాళి తీసేయ్...

నేను కట్టిన తాళి తీసేయ్... - Sakshi


హైదరాబాద్: ‘ నేను కట్టిన తాళి తీసి మావాళ్లకు ఇచ్చేయ్... మరో పెళ్లి చేసుకున్నాక అక్కడైనా జాగ్రత్తగా ఉండు’ అంటూ భార్యను ఉద్దేశిస్తూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  బాలానగర్  ఎస్‌ఐ ఎస్.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... గుంటూరు జిల్లాకు చెందిన యల్లారయ్య (28) నగరానికి వచ్చి బాలానగర్ గీతానగర్‌లో  సీఎన్‌సీ కంపెనీ పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం యల్లారయ్య అదే జిల్లాకు చెందిన రేవతిని పెళ్లి చేసుకున్నాడు.


 


తన కంపెనీ పైనే కాపురం పెట్టాడు. ఆషాఢ మాసం సందర్భంగా జూన్ నెలలో రేవతి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి యల్లారయ్య ఒక్కడే నగరంలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు యల్లారయ్య ఇంట్లో కంపెనీ భాగస్వామి వెంకీ, మరో ఇద్దరు భోజనం చేసి వెళ్లారు.  నిన్న యల్లారయ్య కంపెనీకి రాలేదు. దీంతో కంపెనీలో పనిచేసే కార్మికుడు యల్లారయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా అతను చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు.



సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న డైరీ, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డైరీలో సూసైడ్ నోట్ రాసి ఉంది. అందులో ‘అమ్మానాన్న, అక్కాచెల్లి, తమ్ముడు, బావలు నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా..., రేవతి మీ నాన్నను నోరు అదుపులో పెట్టుకోమను.. నిన్ను ఏనాడు కొట్టలేదు..తిట్టలేదు. మా మామగారు అనే మాటలు పడలేక సెలవు తీసుకుంటున్నా..  బై..బై అని ఉంది. మృతుడు యల్లారయ్య మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యల్లారయ్య మృతిపై కుటుంబసభ్యులుగాని అనుమానం వ్యక్తం చేస్తే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top