కాంట్రాక్టర్‌ పేరుతో డబ్బు వసూళ్లు


గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్) : సివిల్ కాంట్రాక్టర్‌గా చెప్పుకుంటూ అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని అఫ్జల్‌గంజ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్సై కిషన్ కథనం ప్రకారం.. గౌలిగూడకు చెందిన సుబ్రహ్మణ్య రాజు సివిల్ కాంట్రాక్టర్ అవతారమెత్తి అపార్ట్‌మెంట్లు, ఇండ్లు నిర్మించి ఇస్తానని పలువురి వద్ద అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకున్నాడు. కొంతమేర పనులు చేసినట్లు చూపి రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు. ఎవరైనా నిలదీస్తే వారిపై కోర్టు, హెచ్‌ఆర్‌సిల్లో భార్యతో కేసులు వేయించి భయపెడుతున్నాడు.



ఈ నేపధ్యంలో గౌలిగూడ బస్‌డిపో సమీపంలో ఉండే అశోక్ వద్ద ఇంటి నిర్మాణం కోసం రూ.40 లక్షలకు మాట్లాడుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. పిల్లర్ల వరకు నిర్మాణం చేపట్టి నిలిపివేశాడు. అలాగే మరో వ్యాపారి వద్ద ఇంటి నిర్మాణానికి రూ.27లక్షలకు మాట్లాడుకొని, రూ.9 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకోని మొదటి అంతస్తు వరకు నిర్మించి నిలిపివేశాడు. వీరు నగదు తిరిగి ఇవ్వాలని కోరగా వాయిదాలు పెడుతున్నాడు. దీంతో బాధితులు అఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు సుబ్రహ్మణ్యరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top