'మూడు అక్షరాల పదవిని అమ్ముకున్నాడు'

'మూడు అక్షరాల పదవిని అమ్ముకున్నాడు' - Sakshi


హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం ప్రజల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని డాగ్‌బంగ్లాలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల ప్రతినిధిగా చెప్పకునే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నేడు ప్రజలు తలదించుకునేలా వ్యవహరించారని, నడిబజారులో ఎమ్మెల్యే అను మూడు అక్షరాల పదవిని అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి నేడు ఈ ప్రాంత అభివృధ్ది పేరుతో అధికార దాహంతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని విమర్శించారు.



టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విధంగానే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని . కిషన్రెడ్డిని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గత ఎన్నికలల్లో రెండు సార్లు ఏ విధంగా గెలిచారో ప్రజలకు తెలుసునని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల్లో నైతిక విజయం ఎవరిదో ప్రజలకు తెలుసునని, స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్యే, ఎంపీకి కలిసి దాదాపు 70 వేల ఓట్లు నియోజకవర్గంలో వచ్చాయంటే నీది గెలుపేనా..? నీవు చరిష్మ ఉన్న నాయకుడివా..? అంటు విమర్శలు చేశారు. నీవు చరిష్మగల నాయకుడివి అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాకోర్టుకు సిద్దం కావాలని సవాల్ విసిరారు.



టీడీపీలో ఉన్నప్పుడు జెడ్పీ ఎన్నికలు వస్తే కిషన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌కు మద్దతుగా మూడు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నమాటా వాస్తవం కదా?..అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్వార్ధ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పట్నం అభివృధ్దిపై మట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. అభివృధ్దిపై నీకు ప్రేమ ఉంటే దమ్ము, సత్తా కలిగిన నాయకుడు పోరాటలతో ఉద్యమిస్తాడని, నీలా ఇతర పార్టీలకు అమ్ముడుపోడని విమర్శించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని 300 ఎకరాలకు సంబంధించి 20 కోట్ల రూపాయలు వస్తే మూడు కోట్ల రూపాయలు రైతులకు పంచావని, మిగతా 17 కోట్ల రూపాయలు కూడా పంచేస్తే ఇబ్రహీంపట్నం రైతుల రైతాంగాన్ని కాపాడినవాడివి అవుతానని సూచించారు.


గెలిచిన నీ పదవిని అడ్డం పెట్టుకొని ఎవడబ్బా సోమ్మని తింటున్నావని విమర్శించారు. చేసిన పాపాలను తుడ్చడానికి టీఆర్‌ఎస్‌లో చేరతున్నారని, బజారులో అమ్ముడుపోయిన ఎమ్మెల్యే అని అన్నారు. నియోజకవర్గంలో వడగండ్ల వర్షం పడి రైతన్నలు నష్టాలలో ఉంటే, ప్యాకేజీలతో పబ్బం గడుపుతున్నాడని ఎద్దేవా చేశారు. తాను ప్రజల మనిషినని, ఇక పట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఉద్యమిస్తానని మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. 


కష్టం వచ్చిన, నష్టం వచ్చిన నేనుంటానంటూ ఆయన నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నానన్నారు. విలేకరులు టీడీపీలో చేరుతారా....? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ నియోజకవర్గంలో అన్ని పార్టీలలో తనను అభిమానించే నాయకులు ఉన్నరన్నారు. సమావేశంలో మంచాల జెడ్పీటీసీ సభ్యుడు భూపతిగల్ల మహిపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్నాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ డెరైక్టర్లు రవీదంర్‌రెడ్డి, నిట్టు కృష్ణ, ముడుపు వెణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top