ప్రజల ఆశలు తీర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు

ప్రజల ఆశలు తీర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు - Sakshi


టీడీపీ నేతల వర్క్‌షాప్‌లో చంద్రబాబు వెల్లడి

 

సాక్షి, హైదరాబాద్: ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలతో పేర్కొన్నారు. తప్పు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయంలోనే కాకుండా పరిపాలనా వ్యవహారాల్లో కూడా కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టే కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

 

పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంఘా చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన సుమారు గంటన్నర పాటు ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌లపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రచారం, గ్రిడ్లు, మిషన్లు అనే మూడు అంశాల చుట్టూనే ప్రభుత్వ పాలన సాగుతుందని వివరించారు. ఈ వర్క్‌షాప్‌కు ‘సాక్షి’ ప్రతినిధులను చంద్రబాబు అనుమతించలేదు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్త ఇవ్వటం జరిగింది. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

 

దేశంలో ఏ రాష్ట్రానికీ లేనటువంటి సముద్ర తీరంతో పాటు అపారమైన ఖనిజ సంపద, వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే దేవాలయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని పేద రికం నిర్మూలించటంతో పాటు ఆరోగ్యకర, ఆనందమైన స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించటమే లక్ష్యం. రాష్ట్రంలో 14 నౌకాశ్రయాలు, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం. శ్రీకాకుళం నుంచి మైపాడు వరకూ ఉన్న బీచ్‌లు, చారిత్రక కట్టడాలను అనుసంధానం చేయటం ద్వారా బీచ్, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం.

 

పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్లు కార్యక్రమాలను ప్రచారాంశాలుగా చేసుకుని రానున్న ఐదు సంవత్సరాలు పార్టీ ప్రజాప్రతినిధులు పని చేయాలి.

 

వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్‌ల ద్వారా సామాన్యులకు అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తాం. మౌలిక వసతుల కల్పనకు అర్బన్, ఇండస్ట్రీ, మౌలిక సదుపాయాలు, సర్వీస్, నైపుణ్యత పెంపు, సాధికారిత, ప్రైమరీ మిషన్లను ఉపయోగించుకుంటాం. అన్ని శాఖలను ఈ మిషన్లకు అనుసంధానం చేస్తాం. సూచికలు ఏర్పాటు చేస్తాం. నీటి గ్రిడ్ ద్వారా సాగునీరు, పరిశ్రమలకు నీటి కొరత  లేకుండా చూస్తాం. రోడ్ గ్రిడ్ ద్వారా రవాణా వ్యవస్థను మెరుగు పరచటంతో పాటు ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మిస్తాం.

 

పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరం. పార్టీ కార్యక్రమాలపై ఎప్పటికపుడు సమీక్షలు జరగాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి సమన్వయం చేయాలి. నాయకుల్లో నైపుణ్యం పెరగాలి. నేతలు ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ముందుకొచ్చారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. పలు విద్య, ప్రభుత్వ సంస్థల ఉమ్మడిగానే ఉన్నాయి. పరస్పర అంగీకారంతోనే విభజన జరగాలి. సమన్వయంతో ముందుకు వెళ్లాలి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top