లారీ బోల్తా నలుగురి మృతి
తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన తుర్కపల్లి మండలం మల్కాపూర్ వద్ద బుధవారం చోటుచేసుకుంది.
తుర్కపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లున్న మినీ లారీ మల్కాపూర్ మూల మలుపు వద్దకు చేరుకోగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో లారీలో ఉన్న నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా.. డ్రైవర్ అతి వేగం కారణంగానే లారీ బోల్తా కొట్టిందని స్థానికులు అంటున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.