జల్సాల కోసం.. ల్యాప్టాప్లపై కన్నేశాడు
హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు అక్రమమార్గం పట్టాడు. సులభంగా పనికానిచ్చే వీలుంటుందని ల్యాప్టాప్లపై కన్నేశాడు. చిన్నాచితక దొంగతనాలతోపాటు ఎక్కడా ల్యాప్టాప్ కనిపించినా నొక్కేయడం పనిగా పెట్టుకున్నాడు. ఈ నేరాలపై ఓసారి జైలుకు వెళ్లివచ్చినా అతని బుద్ధి మారలేదు. మరోసారి దొంగతనానికి పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు.
వరంగల్ జిల్లా పాలకూర్తి మండలం గూడూరుకు చెందిన కట్కూరి పురుషోత్తంరెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2014 సెప్టెంబర్లో అబిడ్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా 2015 మార్చిలో విడుదలయ్యాడు. బయటకొచ్చినా అతని ధోరణి మారలేదు. తిరిగి దొంగతనాలే వృత్తికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతూ మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు. అతని వద్ద నుంచి 15 ల్యాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.