పక్కాగా కృష్ణానీటి ప్రవాహ లెక్క!


- సాగర్, శ్రీశైలం సహా 14 చోట్ల టెలీమెట్రీ విధానం అమలు

- ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖలు

 

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, విడుదలకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండేలా కృష్ణా నదీ యాజ మాన్య బోర్డు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో చుక్క నీటికి కూడా తేడాలు రాకుండా నాగార్జునసాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు బుధవారం లేఖలు రాసింది. సాగర్, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి, సాగర్ కుడి, ఎడమ కాల్వ లు, ఏఎంఆర్‌పీ ప్రాజెక్టుల్లో మొత్తంగా 14 పాయింట్లలో రిజర్వాయర్ల లెవల్, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోను గణించేందుకు టెలీ మెట్రీ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. వీటి నిర్వహణ బాధ్యతలను చూసేందుకు 15 మంది అధికారులను కేటాయించాలని కోరింది. ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తే ఈ ఏడాది నుంచే నీటి ప్రవాహ లెక్కలను పక్కాగా తేలుస్తామని వెల్లడించింది.

 

 వరద అంచనాకై రంగంలోకి ‘ఇస్రో’

 నాగార్జునసాగర్ వద్ద కృష్ణానదీ ప్రవాహాలపై అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో) రంగంలోకి దిగింది. సాగర్ వద్ద గతంలో నమోదైన వరద వివరాలను తమకు ఇవ్వాలని, దాని ఆధారంగా వరద సంభావ్యతలను ముందుగా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని ఇస్రో అధికారి ఒకరు నీటిపారుదల శాఖకు లేఖ రాశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top