కవితోత్సవం
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ‘ఎ సెలబ్రేషన్ ఆఫ్ తెలంగాణ పొయెట్రీ’ పేరుతో ఆదివారం తెలంగాణ కవుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజా కవి, గాయకుడు గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రజల కన్నీటి కథలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు దాదాపు 36 మంది కవుల రచనలను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదించారు.
ప్రధానంగా మాతృభాష గొప్పదనం, పద్య, గద్య రచనలు వంటి విషయాలపై చర్చించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి ఎన్. గోపి అధ్యక్షత వ హించగా, కవి నిఖిలేశ్వర్, కవి,దర్శకుడు బి నర్సింగరావు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, సంపాదకులు కె.శ్రీనివాస్, కట్టా శేఖర్రెడ్డి, కవి అంబటి సురేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎస్జే
పాచుర్యం కావాలి
‘నేను ఇరవై ఏళ్లుగా తెలుగు అధ్యాపకురాలిగా పని చేస్తున్నాను. ఇప్పటి తరానికి మాతృభాష మీద మమకారం చాలా తక్కువ. తెలంగాణ భాష, యాస, సంస్కృతి వృద్ధి కోసం మేం చేస్తున్న కృషి కొంతమందికైనా ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నా’
- కొత్తపల్లి నీహారిణి, తెలుగు అధ్యాపకురాలు
ఇంకా మెరుగుపడాలి...
‘నిరుటితో పోల్చితే ఈ ఏడు కవి సమ్మేళనం బాగా జరిగింది. అయితే ఇతర రాష్ట్రాల కవులతో కూడా చర్చాగోష్టి, సంస్కృతి, భాషలపై అవగాహన వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది’
- పి.రవీందర్, రీసెర్చ్ స్కాలర్
అనువాదం అవసరం
‘ఒక జాతి కథ, వ్యధ, ఆచారాలు, తెలియాలంటే ముందుగా భాష తెలియాలి. నేడు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైన భాష ఇంగ్లిష్. అందుకే తెలంగాణ కవుల రచనల్ని అనువదించాలని నిర్ణయించుకున్నాం’
- ఎ.తిరుపతిరెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, అనువాదకులు