కాంగ్రెస్వి దిగజారుడు రాజకీయాలు
ఆ పార్టీ నాయకులే నిరసనలు చేస్తున్నారు: కవిత
నిజామాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, బతుకమ్మ పండుగ చీరలను అడ్డుకోవడం నీచ రాజకీయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించా రు. సోమవారం నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రథమ బ్యాచ్ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎక్కడ కూడా విమర్శలు వినపడలేదనీ, నిరసనలు జరగలేదన్నారు.
ఆడపడుచులు ఆనందంగా చీరలను తీసుకుంటున్నారన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్న చోట చీరలను అడ్డుకోవడం, నిరసనలు జరుగుతున్నాయన్నారు. ‘అమ్మపెట్టదు, పెట్టనివ్వదు, అడుక్క తిననివ్వదు’అన్న చందంగా కాంగ్రెస్ నాయకుల తీరు మారిందన్నారు. ఇదివరకు మీరు ఎప్పుడూ పని చేయలేదని.. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ వచ్చిందని చీరలను అందిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రశ్నించారు.