శంషాబాద్ నుంచి బయల్దేరిన కబాలి ఏ 320
సాక్షి,సిటీబ్యూరో: సూపర్స్టార్ రజనీకాంత్ తాజా సినిమా కబాలి కోసం అద్భుతమైన రంగులతో,రజనీకాంత్ చిత్రాలతో ముస్తాబు చేసిన ఎయిర్ ఏసియా కబాలి ఏ 320 ఎయిర్క్రాప్ట్ గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. కబాలి ఏ 320 ని ముస్తాబు చేసేందుకు జీఎమ్మార్ ఏరో టెక్నిక్ లిమిటెడ్ నిపుణులు వారం రోజులు రాత్రింబవళ్లు కష్టపడి చక్కటి రంగులతో, లక్షలాది మంది అభిమాన ప్రేక్షకుల మదిని దోచుకున్న రజనీకాంత్ చిత్రాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. జీఎమ్మార్ ఏరో టెక్నిక్ రిపేర్ అండ్ ఓవరాల్ విభాగం ఈ ప్లైట్కు ఆధునిక హంగులద్దింది. ఎయిర్ ఏసియా భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏరో టెక్నిక్ లిమిటెడ్ ఇంజనీరింగ్ నిపుణులు తమ ప్రతిభా పాటవాలను ఉన్నతంగా ఆవిష్కరించారు.సినిమాలో ఎంతో గంభీరంగా, హూందాగా కనిపించే రజనీకాంత్ పెయింటింగ్స్ను అదేస్థాయిలో ఏ మాత్రం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దారు.ఎయిర్ ఏసియా కబాలి 320 ని రూపొందించే అవకాశం తమకు లభించడం పట్ల గర్వంగా భావిస్తున్నట్లు జీఎమ్మార్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.