ఆ అమ్మకాలను రద్దు చేయండి

ఆ అమ్మకాలను రద్దు చేయండి - Sakshi


సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములను, మార్గదర్శకాలకు, నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నామమాత్రపు ధరకే విక్రయించిన వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇప్పటికే జరిగిన  సత్రం భూముల అమ్మకాలను రద్దు చేసి, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.



రూ.22.44 కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేసిన మందల సంజీవరెడ్డి, సునీతారెడ్డి, చావలి కృష్ణారెడ్డి, సూర్యకిరణ్ మౌళి, డి.పవన్‌కుమార్, ఆర్.శివరామకృష్ణారెడ్డిలపై ఆదాయపు పన్ను శాఖ విచారణకు ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.



ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సదావర్తి సత్రం ఈవో, ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్, పెద్దకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక సీజే విచారించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top