'నన్ను విమర్శిస్తే పార్టీకే నష్టం'
హైదరాబాద్: సీఎల్పీ నేత జానారెడ్డి తీరుపై తెలంగాణ సీఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చ కొనసాగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో మూడు గంటలుగా సమావేశం కొనసాగింది. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం మహా ఒప్పందం విషయంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంతపార్టీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. 'మీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా ఉన్నాయి' అని జానారెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై జానారెడ్డి సీఎల్పీ సమావేశంలో సుధీర్ఘ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆయన వాపోయారు. తనను విమర్శిస్తే పార్టీకే నష్టమని ఆక్రోశం వెల్లగక్కారు. ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం కేసులో సీబీఐ విచారణ అవసరం లేదన్న జానారెడ్డి వ్యాఖ్యలను సమావేశంలో పలువురు నేతలు తప్పుబట్టారు. ఈ రెండు అంశాలపై గంటకు పైగా జానారెడ్డి వివరణ ఇచ్చారు.