ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం: ఎల్. రమణ


సాక్షి,హైదరాబాద్: పారిశుద్ధ్య, అంగన్‌వాడీ, నిజాం షుగర్స్ కార్మికుల సమస్యలకు సర్వరోగ నివారిణి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమేనని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు కనీసం ఆ సమస్యల గురించి ఆలోచించడం లేదని తెలంగాణ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆదివారం టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో టీటీడీ పీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు ఇ.పెద్దిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ‘పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యక్ష దేవుళ్లు’ అన్న కేసీఆర్ వారి సమస్యలు పట్టించుకోకుండా, తనని కలవడానికి కూడా కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఎల్.రమణ విమర్శించారు.



కార్మికుల హక్కుల పరిరక్షణ పోరాటానికి, టీఎన్‌టీయూసీకి పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోగా నిజాం షుగర్స్, సిర్పూరు పేపర్‌మిల్‌ను మూసి వేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసం నడుస్తున్నదే కానీ, కార్మికుల కోసం కాదనన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఔట్ సోర్సింగ్ వర్కర్ ఉండడని ఎన్నికల ముందు చె ప్పిన కేసీఆర్ ఈ రోజు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి, పార్టీ ఉపాధ్యక్షుడు ఇ.పెద్దిరెడ్డి నిలదీశారు. టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బోస్, ఎంపీ మల్లారెడ్డి, పార్టీ నేతలు రావుల పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top