సీబీఐతో విచారణ జరిపించాలి
నారాయణరెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన
సాక్షి, హైదరాబాద్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యోదంతంలో నిజానిజాలు నిగ్గు తేలాలంటే, ఏ స్థాయిలో కుట్ర జరిగిందో బయటకు రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడారు.
పక్కా ప్రణాళిక రూపొందించి నారాయణరెడ్డిని నిరాయుధుడిని చేసి చంపితే, దీనికి రెండు కులాల మధ్య గొడవలు అంటూ ప్రచారం చేయడం దారుణమని, దీన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజం ఏమిటో మరోసారి రుజువైందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన తనయుడి ప్రోద్బలంతోనే నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేశారని చెప్పారు. ఎపుడో గ్రామం వదలి వెళ్లిన వారిని తిరిగి రప్పించి పక్కా ప్రణాళికతో నారాయణరెడ్డిని హత్య చేయించారని విమర్శించారు.