అయితే ‘మాకేంటి ?’


సీఎం ఆదేశాలు బేఖాతర్

హెచ్‌ఎండీఏలో మారని అధికారుల తీరు

 


సిటీబ్యూరో: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆదేశమంటే.... ఎలా ఉంటుందో.. దాని ప్రభావం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. హెచ్‌ఎండీఏలో మాత్రం ఇలాంటి ఆదేశాలు చెల్లవు. అక్కడ ప్రతి పనికీ ఓ ‘లెక్క’ ఉంటుంది. ఆ ‘లెక్క’ ప్రకారమే పనులు జరుగుతాయి. లేదంటే... ఆ ఫైళ్లకు బూజు పట్టాల్సిందే. అందుకు నిదర్శనం కావాలంటే చూడండి...గచ్చిబౌలిలో కార్పొరే ట్ హాస్పిటల్స్ నిర్మాణానికి అనువుగా మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాల్సిందిగా స్వయంగా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. హెచ్‌ఎండీఏ అధికారులు వీటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. సంబంధిత కార్పొరేట్ సంస్థలు వచ్చి తమను కలిశాకే అనుమతులివ్వాలన్న ఉద్దేశంతో నెల రోజులుగా ఫైల్‌ను తొక్కి పెట్టేసినట్లు వినికిడి.



 ఆశయానికి గండి...



గచ్చిబౌలిలో స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ నిర్మించేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం సర్వే నం.136లో 5 కార్పొరేట్ సంస్థలకు ఏడెకరాలు విక్రయించింది. క్వాలిటీ కేర్ మెడికల్ (1 ఎకరా), ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (1.9), మ్యాక్స్ విజన్ (1.7), రెయిన్‌బో ఇన్‌స్టిట్యూట్ (1.1), సర్వే జన ఇన్‌స్టిట్యూట్ (సన్ షైన్) 1.2)లు మొత్తం 5.19 ఎకరాలు కొనుగోలు చేశాయి. రోడ్డు కోసం 1.11 ఎకరాలు, పార్కింగ్‌కు 10 గుంటల విస్తీర్ణం కేటాయిస్తూ మొత్తం 7 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ ప్లాట్లలో రోడ్డు అస్తవ్యస్థంగా ఉండటంతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన సంస్థల వారు ఒకేచోట అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ఆస్పత్రులు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. రోడ్డుఅలైన్‌మెంట్ మార్చాలని హెచ్‌ఎండీఏను కోరారు. దీనిపై 2012లో హెచ్‌ఎండీఏ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆస్పత్రులు నిర్మించలేకపోయారు.



పట్టించుకోని డెరైక్టర్లు



సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని ఆదేశించారు. ఆ మేరకు ఎంఏ అండ్ యూడీ నుంచి అప్రూవల్ ఇచ్చేశారు. ఇది జరిగి నెల రోజులైనా  హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ సంస్థలు తమను కలవాలన్న ఉద్దేశంతో ఫైల్‌ను తొక్కిపెట్టేశారు.  ఈ అంశం తన పరిధిలోకి రాదంటూ ప్లానింగ్ డెరైక్టర్-1, తనకు సంబంధం లేదంటూ డెరైక్టర్-2లు ే ఫైల్‌ను అటూ ఇటూ చక్కర్లు కొట్టిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారంతా బడా వ్యాపారవేత్తలు కావడంతో ఇక్కడి డెరైక్టర్ స్థాయి అధికారులను కలిసేందుకు ఆసక్తి చూపట్లేదు. హెచ్‌ఎండీఏలోని అక్రమార్కులను ఓవైపు ఏసీబీ వెంటాడుతున్నా... అధికారులు, సిబ్బంది తీరు మార్చుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top