కేసీఆర్‌కు రాజకీయ జీవితం లేకుండా చేస్తా

కేసీఆర్‌కు రాజకీయ జీవితం లేకుండా చేస్తా - Sakshi


► కుటుంబ పాలనను ఎత్తిచూపినందుకే ఇరికించారు

► రెండు పెగ్గులేస్తే తప్ప మాట్లాడలేని కేసీఆర్‌కు అంతా తొత్తులుగా మారారని వ్యాఖ్య

►  మళ్లీ మీసం మెలేసి,  తొడగొట్టిన రేవంత్    

 

 సాక్షి, హైదరాబాద్: ‘‘కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనను ఎత్తిచూపినందుకే నాపై కుట్ర పన్ని కేసులో ఇరికించారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం లేకుండా చేస్తా..’’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తనను ఏమీ చేయలేరనన్నారు. బుధవారం ‘ఓటుకు కోట్లు’ కేసులో చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం తొడగొట్టి, మీసాలు మెలేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేక కేసులో ఇరికించారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘రెండు పెగ్గులు తాగితే కాని మాట్లాడలేని కేసీఆర్‌కు అంతా తొత్తులుగా మారారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తున్నావు.. దమ్ముంటే వారితో రాజీనామాలు చేయించి పోటీ చేయించు. వారు గెలిస్తే ముక్కు నేలకు రాస్తా’’ అని సవాలు విసిరారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని కలలు కంటున్నారని, కానీ టీడీపీకి రేవంత్‌రెడ్డి ఉన్నాడని పేర్కొన్నారు. ‘‘ఒడ్డూ  పొడుగు ఉన్న హరీశ్‌రావుకు మెదడు మోకాళ్లలో ఉంది. మామ చేసిన బ్రోకర్ దందాలు ఆయనకు తెలియవా? అవినీతి.. అవినీతి అంటున్న కేసీఆర్‌కు నిజామాబాద్‌లో కొడుకు చేస్తున్న ఇసుక మాఫియా అక్రమాల గురించి  తెలియదా’’ అని ప్రశ్నించారు.



‘‘సన్నాసులంతా తాగుబోతు పక్కన చేరారు. మందులో సోడా పోసేవాళ్లంతా మంత్రులయ్యారు’’ అని విమర్శించారు. పార్టీ అభిమానుల కోలాహాలం మధ్య రేవంత్‌రెడ్డి.. చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచే టీడీపీ శ్రేణులు జైలు వద్ద హంగామా చేశాయి. సాయంత్రం జైలు నుంచి విడుదలైన తర్వాత అభిమానులు అందజేసిన గండ్ర గొడ్డలిని పట్టుకొని గాల్లో తిప్పారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ మహిళ అధ్యక్షురాలు బండ్ర శోభారాణి జైలు వద్ద రేవంత్‌కు స్వాగతం పలికారు.

 బెయిల్ ఉత్తర్వుల్లో తప్పిదానికి సవరణ: ఓటు కు కోట్లు కేసులో ప్రధాన నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలకు బెయిల్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో దొర్లిన చిన్న తప్పిదాన్ని హైకోర్టు బుధవారం సవరించింది. బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతుల్లో ముగ్గురు నిందితులు ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పూచీకత్తులను ఏసీబీ పోలీస్‌స్టేషన్‌కు సంతప్తి కలిగేలా సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి సంతప్తి కలిగేలా పూచీకత్తులు సమర్పించాలని ఉండాలి. దీంతో బుధవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో టైపింగ్ సమయంలో దొర్లిన ఈ తప్పిదాన్ని సవరిస్తూ తిరిగి ఉత్తర్వులు జారీ చేశారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top