కెనడాలో హైదరాబాద్ వాసి మృతి
హైదరాబాద్: కెనడాలోని ఓ జలపాతం వద్ద సరదాగా గడుపుతున్న ఓ కుటుంబంలోని వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నగరంలోని అంబర్పేటకు చెందిన మహమ్మద్ జబ్బార్ కుమారుడు మహమ్మద్ ఖదీర్ అలియాస్ సాజిద్ (33) ఐదేళ్ల క్రితం ఉద్యోగ రీత్యా కెనడా వెళ్లి స్థిరపడ్డాడు. సాజిద్కు ఇటీవల బాబు జన్మించడంతో అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కెనడా వెళ్లారు. గత నెల 29న సాయంత్రం కెనడాలోని కననాస్కిస్ నగరంలో ఉన్న ఎల్బో జలపాతం వద్ద కుటుంబం మొత్తం సరదాగా గడుపుతున్నారు.
ఆ సమయంలో కుటుంబంలోని ఓ వ్యక్తి జలపాతంలోకి జారి పడబోతుండగా, అతన్ని కాపాడే ప్రయత్నంలో సాజిద్ పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబం మొత్తం అక్కడే ఉండటంతో మంగళవారం కెనడాలోనే మృతదేహాన్ని ఖననం చేసినట్లు అంబర్పేటకు చెందిన సాజిద్ చిన్ననాటి స్నేహితుడు ఫీర్జాబేర్ మున్నీర్ తెలిపారు.