ఆమె ఆవేదన నిజమైంది...
హైదరాబాద్: భార్యాపిల్లలను వదిలి వెళ్లి పరాయి స్త్రీతో ఉంటున్న నరేందర్రెడ్డి తన వారి చివరి చూపునకూ రాలేదు. భర్త వేరే మహిళతో ఉంటున్నాడన్న సమాచారంతో తీవ్ర మనస్తాపానికి గురై గచ్చిబౌలిలో శనివారం వినోద రాణి అనే గృహిణి తన కూతురు, కొడుకు ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి తాను సజీవదహనమైన విషయం తెలిసిందే.
‘‘ కనీసం మా శవాలను చూడటానికి భర్త వస్తాడో, లేదో ? భర్తగా, తండ్రిగా మా అంతక్రియలు చేస్తాడా? అసలు మేము చనిపోయినట్లు తెలుస్తుందా’’ అని మృతురాలు వినోద తన సూసైడ్ నోట్లో ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు అదే నిజమైంది. భర్త నరేందర్రెడ్డి వారి అంత్యక్రియలకు రాలేదు. దీంతో వినోద, ఆమె కూతురు జ్యోతి, కొడుకు విఘ్నేష్ల మృతదేహాలకు వినోద తల్లిదండ్రులు, బంధువులు శనివారం రాత్రి రాయదుర్గంలోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిపించారు.
కాగా, నరేందర్రెడ్డి తన భార్యాపిల్లల అంత్యక్రియలకు రాకపోవడంతో అసలు విషయం అతడికి తెలిసిందా? ప్రస్తుతం ఎక్కడున్నాడనేది తెలియాల్సి ఉంది. కాగా, నరేందర్ రెడ్డి ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని గచ్చిబౌలి సీఐ రమేశ్ అన్నారు.