కొద్దిగంటల్లో వివాహం.. అంతలోనే..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెళ్లికుమారుడు వెంకట శేషసాయినాథ్‌ - Sakshi


- రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు మృతి

- ఆయనతోపాటు మరో ముగ్గురి మృత్యువాత

- 20 మందికి గాయాలు

- సూర్యాపేట జిల్లా మోతె వద్ద ఘటన

- హైదరాబాద్‌ నుంచి చర్లకు బయల్దేరిన పెళ్లి బృందం

- విశ్రాంతి కోసం నిలిపిన వాహనాన్ని వెనక నుంచి ఢీకొన్న లారీ




సాక్షి, సూర్యాపేట/హైదరాబాద్‌: కొద్ది గంటల్లో పెళ్లి.. పెళ్లికొడుకుతోపాటు బంధుమిత్రులంతా కలసి సంతోషంగా బయల్దేరారు.. మార్గమధ్యంలో విశ్రాంతి కోసం వాహనం ఆపారు.. ఇంతలో మృత్యువులా దూసుకొచ్చిన ఓ లారీ వీరి వాహనాన్ని ఢీకొంది.. పెళ్లి కొడుకు సహా నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు! మరో 20 మంది గాయాలపాలయ్యారు. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.



హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌కు చెందిన తప్పెట్ల శ్రీనివాసరావు, విజయకుమారి దంపతుల ఏకైక కుమారుడు శేషసాయినాథ్‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన నామగిరి సత్యవాణి, హరి దంపతుల కుమార్తె నాగలక్ష్మితో ఈయనకు వివాహం కుదిరింది. బుధవారం రాత్రి 7 గంటలకు చర్లలో పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకు పెళ్లి కుమారుడు శేషసాయినాథ్‌(22)తో పాటు బంధువులు కూకట్‌పల్లి నుంచి మంగళవారం రాత్రి డీసీఎం వాహనంలో బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున మార్గమధ్యలో సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో విశ్రాంతి కోసం వాహనాన్ని ఆపారు.



అప్పుడే వెనక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో పెళ్లి కొడుకు శేషసాయినాథ్‌తోపాటు ఆయన తాత సత్యనారాయణ(65), బంధువు అఖిల్‌ (7), మిత్రుడు దామోదర్‌ (30) మృతి చెందారు. గాయపడిన 20 మందిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి, మరికొందరిని హైదరాబాద్‌కు తరలించారు. భజనలు, భక్తి పాటలు పాడుతూ చిన్నా, పెద్దలతో కలుపుగోలుగా మెలిగే శేషసాయినాథ్‌ చదువుతో పాటు డ్రమ్స్‌ వాయించడంలో దిట్ట. భక్తి పాటలు పాడటంలో తనదైన శైలిని ప్రదర్శించి మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా బహుమతులను అందుకున్నాడు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top