అగ్రిగోల్డ్ కేసులో తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు

అగ్రిగోల్డ్ కేసులో తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు - Sakshi




హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు శుక్రవారం తుదితీర్పును వెల్లడించింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాలను కమిటీ పర్యవేక్షిస్తుందని, అలాగే బాధితులకు నగదు చెల్లింపు కమిటీ పర్యవేక్షణలోనే జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. లావాదేవీల కోసం రిజిస్ట్రార్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయాలని, మొదటి విడతలో 14, రెండో విడతలో 5 ఆస్తులు అమ్మకం జరగాలని కోర్టు సూచించింది.



ఈ-ఆక్షన్ ద్వారా ఆస్తుల అమ్మకాలు జరగాలని, చెక్కులు, డీడీలు, పే ఆర్డర్లు, ఆర్టీజీఎస్ రూపంలో లావాదేవీలు ఉండాలని, ఆస్తుల అమ్మకానికి అగ్రిగోల్డ్ యాజమాన్యం సహకరించాలని హైకోర్టు పేర్కొంది. ఆస్తులపై కోర్టుకు తప్పుడు సమాచారమిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, రిటైర్డ్ న్యాయమూర్తి పేరు సోమవారం ప్రకటిస్తామని న్యాయస్థానం తెలిపింది.



కాగా ఇప్పటికే సంస్థకు సంబంధించిన 300 ఆస్తుల వివరాలను అగ్రిగోల్డ్  హైకోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. అందులో ఐదు ప్రధాన ఆస్తుల విక్రయానికి సూత్రప్రాయంగా అంగీకరించిన హైకోర్టు, బాధితుల కోసం రిజిష్ట్రార్‌ పేరు మీద ఖాతా తెరవాలని ఆదేశించింది.  కేసుతో సంబంధమున్న అధికారులు, సంస్థ యాజమాన్యం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top