'బావర్చి' హోటల్ సీజ్

'బావర్చి' హోటల్ సీజ్


హయత్‌నగర్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిన హయత్‌నగర్‌లోని హైవే బావర్చి హోటల్‌ను శుక్రవారం రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్‌లో ఉన్న హైవే బావర్చి హోటల్‌లో నిర్వాహకులు కొంత కాలంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఈ నెల 5న పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న నిర్వాహకులు సలీం అలియాస్ యూసఫ్‌తో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రూ.2.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించడంతో పాటు హోటల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆర్డీఓకు లేఖ రాశారు.



దీనిపై విచారించిన ఇబ్రహింపట్నం ఆర్డీఓ గేమింగ్ యాక్ట్ ప్రకారం హోటల్‌ను సీజ్ చేయాలని గత బుధవారం పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి, మన్మదకుమార్, నాగరాజు, వీఆర్‌ఓ ఫణిందర్‌లు శుక్రవారం హోటల్‌ను సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఆయన ఆదేశాలతో హోటల్‌పై చర్య తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top