హ్యాపీనెస్ సూత్ర
‘జీవితాన్ని మరీ సీరియస్గా తీసుకోకు. అలాగని పరాకుగా ఉండకు. ఎదుర్కొనే ప్రతి సమస్యకీ సాక్షిగా ఉండు చాలు, అనుభవమే అన్నింటికన్నా పెద్ద పాఠం’ అని ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’లో సీఐఎస్ఎఫ్ డీఐజీ విక్రమ్ తుమ్మల వ్యాఖ్యానించారు. ఆయన స్వీయ రచన ‘హ్యాపీనెస్ సూత్ర’ పుస్తకాన్ని రామకృష్ణ మఠం అధ్యక్షుడు జ్ఞానదానంద ఆవిష్కరించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో విక్రమ్ మాట్లాడుతూ... ‘జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల ద్వారా తాను నేర్చుకున్న విషయాలకే అక్షర రూపాన్ని ఇచ్చా.
నేను ఈ స్కూల్ పాత విద్యార్థిని. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా గెలుపు ఓటములను చూశా. గెలుపు వస్తే సంబర పడడం, ఓటమి ఎదురైతే కుంగిపోవడం మానవ సహజం. కానీ హ్యాపీనెస్ సూత్ర చదివితే ఆ రెండింటికీ అతీతంగా ఉండాలన్న ఆలోచన వస్తుంది. ఈ పుస్తకం పంచకోశం, వేదాంతం, ఖురాన్లోని అంశాలు, ఇంకా కొన్ని పురాణ గాథల్ని స్పృశిస్తుంది. నా దృష్టిలో దైవం అంటే ఒక శక్తి. దానికి మతం, రూపం అంటూ ఉండదు. నిశ్చల ఆనందాన్ని పొందేందుకు నేను చేసిన ఫలమే ఈ హ్యాపీనెస్ సూత్ర’ అన్నారు.
సాక్షి, సిటీ ప్లస్