హైదరాబాద్కు వరం.. గోదావరి జలాలు
మేడ్చల్: హైదరాబాద్ మహానగరానికి గోదావరి జలాలు వరప్రదాయిని వంటివని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం ఘనాపూర్లో క్షేత్రగిరిపై నిర్మించిన సంపును మంగళవారం ఆయన పరిశీలించి, నీటి ట్రయల్న్ పనులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చడంలో భాగంగా.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు 186 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ వేసి 4 దశలలో 9 పంపులతో ప్రాజెక్టును రూ.3,375 కోట్లతో పూర్తి చేసినట్లు చెప్పారు.
నెల రోజుల్లో ఈ సంపు నుంచి నగరంలోని శేరిలింగంపల్లి వరకు మొదటి విడతలో, సైనిక్పురి వరకు రెండో విడతలో గోదావరి జలాలను ఇంటింటికీ సరఫరా చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నగరానికి ఏళ్ల తరబడి మంచినీటిని సరఫరా చేస్తున్న జలాశయాలు వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోయినా ప్రభుత్వం నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి జలాల తరలింపు చేపట్టిందని కేటీఆర్ చెప్పారు. వచ్చే వేసవిలో సైతం నగరవాసులకు నీరందిస్తామన్నారు. హైదరాబాద్లో అంతర్గత పైప్లైన్లను త్వరలోనే పూర్తిచేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించి మాట నిలబెట్టుకుంటామని మంత్రి చెప్పారు.