స్నేక్ గ్యాంగ్ తరహాలో గ్యాంగ్ రేప్

స్నేక్ గ్యాంగ్ తరహాలో గ్యాంగ్ రేప్


* ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు

* రాజీకి రావాలంటూ బాధిత కుటుంబానికి ఫోన్లు

* లేకుంటే రేప్ దృశ్యాలు నెట్‌లో పెడతామని బెదిరింపు

* గత నెలలో జరిగిన ఘటన


 

సాక్షి, హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ రేప్ తరహాలోనే కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఘోరం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసుల అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. గ్యాంగ్‌రేప్ కేసు రాజీ కుదుర్చుకోవాలని లేకుంటే అత్యాచార దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడతామని పరారీలో ఉన్న నిందితుడు.. బాధితులను బెదిరిస్తున్నాడు. అయితే వారి బెదిరింపులకు భయపడకుండా బాధితురాలు తన తల్లితో కలిసి ఆదివారం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాబానగర్‌కు చెందిన ఓ మహిళకు భర్త చనిపోవడంతో దుబాయ్‌లో పనిమనిషిగా చేస్తుంది. ఆమె 15 ఏళ్ల కూతురు బాబానగర్‌లోనే ఉంటుంది.

 

స్థానికంగా ఉన్న ఒక టైలరింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటుంది. కూతురు బాగోగులు చూసేందుకు బంధువైన అయూబ్‌కు నెలనెలా ఆమె డబ్బులు పంపేది. కాగా, గత నెల 5వ తేదీన బాలిక శిక్షణ ముగించుకుని ఇంటికి వస్తుండగా అషఫ్ అలీ అలియాస్ చందు, అయూబ్‌లు ఆటోలో బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అత్యాచార దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే యాసిడ్ పోస్తామని, కుటుంబ సభ్యులను హతమారుస్తామని బెదిరించారు. దీం తో భయపడిన బాలిక జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే గత నెల 14న దుబాయ్ నుంచి తల్లి రావడంతో జరిగిన విషయాన్ని ఆమెతో చెప్పింది. దీంతో ఆమె కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చందు ( అషఫ్ ్రఅలీ)ను మాత్రమే అరెస్టు చేశారు. అయూబ్‌ను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు. నిందితుడు అయూబ్ అతని అనుచరులు షకీల్, అసద్‌లు పోలీసులకు చిక్కకుండా కేసు రాజీ కుదుర్చుకోవాలని లేదంటే అత్యాచార దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడతామని బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. నెల రోజుల నుంచి వీరి బెదిరింపులు ఎక్కువ కావడంతో ఆదివారం తల్లికూతుళ్లు మళ్లీ పోలీసులను ఆశ్రయించి మరో ఫిర్యాదు చేశారు. అయూబ్‌ను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

 

మరికొందరు బాధితులు

అయూబ్, చందు( అషఫ్ రఅలీ)ల అనుచరుల చేతిలో పలువురు బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారని తల్లి ఆరోపించింది. బాధితులు భయంతో ముందు కు రావడం లేదని, వీరి అరాచకాలను ఇకనైనా అడ్డుకోవాలని కోరుతోంది. వీరి బారిన పడిన కొంత మంది బాధితుల వివరాలను పోలీసులకు కూడా చెప్పాను.    

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top