తనయుడితో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం


చందంపేట: భార్య, అత్త, మామ, స్నేహితుడి వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకుతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన పానుగంటి చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని బండ్లగూడలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన లలితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. గత ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం మొదలయ్యింది.



భార్య లలిత బల్మూరు పోలీస్‌స్టేషన్‌లో చంద్రశేఖర్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ వారి మధ్య ఘర్షణలు ఆగలేదు. తన చావుకు భార్య, అత్త, మామలు, స్నేహితుడు నాగరాజులే కారణమని సూసైడ్ నోట్ రాసి, చందంపేట మండలం పోలేపల్లి శివారులోని చెరిపల్లి అంతయ్యబావి వద్ద తాను విషం తాగి కుమారుడు రత్నాకర్‌కు తాగించాడు. ఇద్దరూ స్పృహ కోల్పోతూ రోడ్డుపై కనిపించడంతో చందంపేట నుంచి దేవరకొండకు వస్తున్న మాతంగి కాశయ్య అనే ప్రయాణికుడు చూసి రత్నాకర్‌ను వివరాలు అడగ్గా.. తండ్రి స్పృహ కోల్పోయాడని.. పురుగుల మందు తాగామని చెప్పాడు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top