తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య
హైదరాబాద్ : వర్షాభావ పరిస్థితులు, వేసిన బోర్లులో నీళ్లు లేక పోవటంతో ఓ యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోనగిరి యాదయ్య(28)కు నాలుగెకరాల భూమి ఉంది. దాంతోపాటు మరో ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి, టమాట, క్యారెట్, కంది పంట సాగు చేశాడు. నీటి వసతి కోసం మూడు బోర్లు వేయగా రెండు విఫలమయ్యాయి.
ఒక్క బోరులోని కొద్దిపాటి నీరే వస్తోంది. పంటల సాగు పరిస్థితి సరిగా లేకపోవటంతోపాటు చేసిన అప్పు రూ.4 లక్షల ఎలా తీర్చాల్లో తెలియక తీవ్ర మనోవేదన చెందాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కౌలుకు తీసుకున్న పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు.