కూకట్పల్లిలో దోపిడీ దొంగల బీభత్సం
కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ఏడు చోట్ల దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కేపీహెచ్బీ ఏడో ఫేజ్లో తాళం వేసున్న ఒక ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.
సమీపంలోని ప్రగతినగర్లోని ఓ ఇంట్లో రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తోన్నారు. బాధితులు అందుబాటులో లేకపోవడంతో ఎంత మొత్తం చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రాలేదు. శనివారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీ వీ పుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.