అభ్యంతరాలుంటే రిలీవ్ చేయవద్దు


ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులపై స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగుల విషయంలో ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమైతే, కేంద్రం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సంబంధిత ఉద్యోగులను రిలీవ్ చేయవద్దని సాధారణ పరిపాలన శాఖలోని రాష్ట్ర పునర్విభజన విభాగం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మల పేర్లతో సంయుక్త ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలికంగా మరో రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగుల్లో కింది కేటగిరీల వారిని రిలీవ్ చేయవద్దని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

- తాత్కాలిక కేటాయింపుల్లో తనకు అన్యాయం జరిగిందని ఎవరైన ఉద్యోగి రెండు వారాల గడువులోపు దరఖాస్తు చేసుకుంటే, సదరు ఉద్యోగిని రిలీవ్ చేయవద్దు.

- ఎవరైన ఉద్యోగికి సంబంధించిన తాత్కాలిక కేటాయింపుపై నిర్ణీత గడువులోగా ఇతరుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే సదరు ఉద్యోగిని రిలీవ్ చేయవద్దు.

- తాత్కాలిక కేటాయింపుల ప్రకటన వెలువడిన తర్వాత రెండు వారాల నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు, ఫిర్యాదులు అందితేనే పై రెండు కేటగిరీల ఉద్యోగులను రిలీవ్ చేయకూడదు. గడువులోగా అభ్యంతరాలు అందినా కొందరు ఉద్యోగులను బలవంతంగా రిలీవ్ చేస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top