ఎంసెట్‌లో పదివేల ర్యాంకు కటాఫ్

ఎంసెట్‌లో పదివేల ర్యాంకు కటాఫ్ - Sakshi


ఫీజులపై డిప్యూటీ సీఎం కడియం వెల్లడి

♦ సెక్షన్ 371డీకి లోబడి స్థానికత నిర్ధారణ

♦ఈ-సెట్‌లో వెయి మందికి అవకాశం

♦షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్

♦ రేషనలైజేషన్‌తో బడులు మూతపడవు


సాక్షి, హన్మకొండ: ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో పదివేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా మొత్తం ఫీజు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.



సోమవారం ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కటాఫ్ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలలో నెలకొన్న సందేహాలు, గందరగోళాలను తీర్చేం దుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలి పారు.  ఇప్పటివరకు అమల్లో  ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువమంది తెలంగాణ విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రీయింబర్స్‌మెంట్‌కు పదివేల ర్యాంకు కటాఫ్‌గా నిర్ణయించినట్లు  వెల్లడించారు.



పది వేలు పైబడి ర్యాంకు వచ్చిన విద్యార్థులకు రూ 35,000 వార్షిక ఫీజుగా రీయింబర్స్‌మెంట్ చేస్తామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సెక్షన్ 371డీని అనుసరించి స్థానికతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదివిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, ప్రభుత్వ గురుకుల కాలేజీల్లో చదివిన ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు చెల్లిస్తామన్నారు.

 

ఈ-సెట్ విద్యార్థులకు వరాలు

ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం వరాలు ప్రకటించారు. ఈసెట్ ద్వారా ప్రవేశాలు పొందే వెరుు్య మంది విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని కడియం తెలిపారు.   

 

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు

‘ఫీజుల వివరాలను నోటీసుబోర్డులో ఉంచాలని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచించాం, ఎవరైనా ఈ నిబంధనల ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’  అని కడియం శ్రీహరి హెచ్చరించారు. ఫీజుల వివరాలు వెల్లడించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశించినట్లు వెల్లడించారు. కేజీ టు పీజీ పథకాన్ని 2016-17 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు.  ఇంటర్మీడియెట్ పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని, ఇందుకయ్యే ఖర్చులో సగం(రూ.3 కోట్లు) భరిం చేందుకు శ్రీమేథా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్‌ను వరంగల్‌లో నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఈ నెల 9న  సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.

 

బాలికలకు ఆశ్రమ పాఠశాలలు

కోల్‌బెల్ట్: పదో తరగతి.. ఆపై చదివిన బాలికల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్లు డిప్యూటీ సీఎం  శ్రీహరి వెల్లడించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం మంజూ ర్‌నగర్‌లో సోమవారం సింగరేణి   చేపట్టిన హరితహారం కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారితోపాటు శ్రీహరి హాజరయ్యారు.     శ్రీహరి మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ చదువుకునే బాలికలకు సైతం రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ బాలికల సంరక్షణను పోలీసులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.

 

షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్..

ఎంసెట్ -15 కౌన్సెలింగ్ ప్రక్రియను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. కోర్టు తీర్పుకు లోబడి ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ(హెచ్) ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ వల్ల ఏ ఒక్క పాఠశాల మూతపడదని హామీ ఇచ్చారు.



అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల నుంచి అవసరం ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడమే రేషనలైజేషన్ లక్ష్యమని వివరించారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత డీఎస్సీ గురించి పరిశీలిస్తామన్నారు. తెలంగాణ సిలబస్ కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నిర్ణయించిందని శ్రీహరి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top