ఇంజనీరింగ్ కాలేజీలకు 8 నుంచి సెలవులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలకు ఈనెల 8 నుంచి దసరా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. తొలుత 5వ తేదీ నుంచే సెలవులు ప్రకటించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. అయితే గురువారం యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి నుంచి సర్క్యులర్ అందినట్లు.. అందులో 8వ తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అన్న అంశంపై చర్చించాల్సి ఉందని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదయ్య తెలిపారు. ఈ విషయంపై సోమవారం స్పష్టత వస్తుందని, ఆ వెంటనే కాలేజీలకు సమాచారం అందజేస్తామని వివరించారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలకు 2వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి 13వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పీజీ కళాశాలలకు మాత్రం 8వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 17వ తేదీ నుంచి యథావిధిగా తరగతులు జరుగుతాయి.