జనరిక్ మందులనే వైద్యులు సూచించాలి


సాక్షి, హైదరాబాద్: తమ వద్దకు వచ్చే రోగులకు ప్రతి ఒక్క వైద్యుడు విధిగా జనరిక్ ఔషధాలనే రాసేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) సూచించింది. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని స్పష్టం చేసింది. కమిటీ సమావేశం శుక్రవారం ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు పి. విష్ణుకుమార్‌రాజు, గద్దె రామ్మోహన్‌లతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.



జనరిక్ మందులు ప్రజలకు తక్కువ ధరలకు లభ్యమౌతున్న నేపథ్యంలో వారి ప్రయోజనాల దృష్ట్యా వైద్యులు ఆ మందులనే రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాము రాసే మందుల పేర్లు రోగులకు సులభంగా అర్థమయ్యేలా వైద్యులు చూడాలని చెప్పారు. ఈ బాధ్యతను వైద్య, ఆరోగ్య శాఖ తీసుకోవాలని స్పష్టం చేశారు. మానసిక రోగులకు చికిత్సకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను విజయనగరం జిల్లాలో నిర్ధేశించిన గడువులోగా ఖర్చు చేయకపోవటంతో ఆ తరువాత నిధులను కేంద్రం విడుదల చేయకపోవటాన్ని గుర్తించిన పీఏసీ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. రాష్ర్టంలోని క్యాన్సర్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలులో జరిగిన జాప్యం పట్ల పీఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top