దేవి కేసులో మూడో వ్యక్తి?

దేవి కేసులో మూడో వ్యక్తి? - Sakshi


హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో కారు ప్రమాదం కేసులో నిందితుడు సామ భరత్ సింహారెడ్డిని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థిని దేవి కారు ప్రమాదంలోనే చనిపోయిందని అతడు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో మూడో వ్యక్తి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


వెస్ట్ జోన్ డీసీపీ ఏ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భరత్ సింహారెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. అలాగే దేవి, భరత్ సింహారెడ్డి ఫోన్ కాల్ వివరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలంలో పలువురు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విచారణ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. (అసలేం జరిగింది?)


కాగా దేవిది ముమ్మాటికీ హత్యే అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున చెట్టుకు కారు ఢీ కొట్టిన ప్రమాదంలో  ఇంజినీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నట్లు చెప్పిన కన్నకూతురు.. కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.



తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని దేవి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్నేహితుడు భరత్‌తో కలిసి షెవ్రోలె క్రూయిజర్ కారులో వస్తుండగా అదుపుతప్పి.. చెట్టును ఢీకొంది. ఆ సమయంలో కారులో డ్రైవర్ సీటు వద్ద ఉన్న బెలూన్ మాత్రమే తెరుచుకుంది. దాంతో భరత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దేవి మాత్రం తీవ్రంగా గాయపడింది.  పోలీసులు దేవిని అపోలో ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top