చంద్రబాబు నన్ను అవమానించారు
దళిత ఎమ్మెల్యే ఐజయ్య ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు దళిత ఎమ్మెల్యేనైన తనను దారుణంగా అవమానించారని, అయినా సరే తన నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని అవమానాలనైనా భరిస్తానని నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యక్కలదేవి ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరులో జరిగిన సమావేశంలో మాట్లాడనీయకుండా తన మైక్ను బాబు ఉద్దేశ్యపూర్వకంగా కట్ చేయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జునతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశంలో తాను, రాయలసీమ రైతులను కూడా భాగస్వాములను చేస్తూ జాయింట్ వెంచర్ పెట్టవచ్చు కదా అని సీఎంను అడిగానని, అవన్నీ మీకు చెప్పనక్కర లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి నిరోధకులు అంటూ తనపై చంద్రబాబు మండిపడ్డారన్నారు. జైన్ ఇరిగేషన్ సంస్థ వల్ల ప్రజలకేమీ లాభం లేదని, కేవలం ఆ యాజమాన్యానికే లాభాలు వస్తాయని ఐజయ్య వివరించారు.