ఆలయాల పాలకమండళ్ల పదవీ కాలం తగ్గింపుపై..


సర్కారుకు హైకోర్టు నోటీసులు



సాక్షి, హైదరాబాద్
: దేవాలయాల పాలకమండళ్ల  పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై యథాతథస్థితి (స్టేటస్‌కో)ని కొనసాగించాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.  ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.



ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల పాలకమండళ్ల కాలవ్యవధిని ఏడాదికి తగ్గిస్తూ దేవాదాయ, ధార్మిక సంస్థల చట్టానికి సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలు దేవస్థానాల చైర్మన్లు, ట్రస్టీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కుదింపు నోటిఫికేషన్‌పై యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top