పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి
స్పీకర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్కుమార్, చిట్టెం రామ్మోహన్రెడ్డిపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డితో పాటు కాంగ్రెస్ సభ్యులు జి.చిన్నారెడ్డి, సంపత్కుమార్, పద్మావతీరెడ్డి, వంశీచంద్రెడ్డి తదితరులు శుక్రవారం అసెంబ్లీలోని చాంబరులో స్పీకర్ను కలిసి, ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
అనంతరం గీతారెడ్డి, చిన్నారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరినట్టు తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని, అయినా స్పీకర్ స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటిదాకా కనీసం నోటీసులను కూడా పంపలేదన్నారు. సుప్రీంకోర్టులో జూలై 1న విచారణ ఉందని, అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.