పరుగుతో విశ్వాసం

పరుగుతో విశ్వాసం


దేశం కోసం చేసే ప్రతి పరుగు తనలో ఆత్మవిశ్వాసం నింపుతుందన్నాడు భారత్ క్రికెటర్ అజింక్యా రహానే. ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్‌లో నాలుగు వందల మంది టాప్ ఫినిషర్స్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన టీ షర్ట్స్ ‘ఫినిషర్ టీ’ను నైకి అందించింది.  జూబ్లీహిల్స్‌లోని నైకి రన్నింగ్ డెస్టినేషన్ స్టోర్‌లో భారత క్రికెటర్ అజింక్యా రహానే చేతుల మీదుగా మంగళవారం సాయంత్రం ఈ టీ షర్ట్‌లను రన్నర్‌లు అందుకున్నారు. ఈ సందర్భంగా అజింక్యా రహానే ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు.



మారథాన్‌లో సిటీవాసులు సత్తాచాటారని హైదరాబాదీలను పొగడ్తలతో ముంచెత్తాడు. క్రికెట్‌లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో రన్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నాడు. ‘నేను పొందే శిక్షణలో రన్నింగ్ ఎంతో కీలకం. అది నన్ను చురుగ్గా  ఉంచుతుంది. హైదరాబాద్ మారథాన్‌లో ప్రతి రన్నర్ పడిన శ్రమకు, అంకితభావానికి హ్యాట్సాఫ్’ అని ప్రశంసించాడు. హైదరాబాద్ స్వీట్ సిటీ అన్న ఈ ఆటగాడు ఇక్కడి రుచులు మాత్రం స్పైసీతో టేస్టీగా ఉంటాయంటున్నాడు.



ధోనీ, కోహ్లీ బెస్ట్ రన్నర్స్..



భారత క్రికెట్ జట్టులో వికెట్ల మధ్య ఫాస్ట్‌గా పరుగెత్తడంలో కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీ ముందుంటారన్నాడు. సచిన్, ద్రవిడ్ తన అభిమాన క్రికెటర్లని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో సెంచరీ చేయడం ఎంతో ఆనందానిచ్చిందన్నాడు. గంట గంటకూ మారిపోయే ఇంగ్లండ్ వాతావరణానికి తగ్గట్టు మన ఆటను మార్చుకోవాల్సి ఉంటుదని తెలిపాడు. తనను ద్రవిడ్‌తో పోల్చడం సరికాదన్న ఈ యువ ఆటగాడు.. ఇప్పుడిప్పుడే ఆటను మెరుగుపరుచుకుంటూ నిలదొక్కుకుంటున్నానని చెప్పాడు. సీనియర్ల మార్గనిర్దేశంలో యువ ఆటగాళ్లు రాటుదేలుతున్నారన్న రహానే  డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం బాగుంటుందన్నాడు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top