సీఎం కేసీఆర్ పాలన అధ్వానం
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ధ్వజం
- ఏ లఫంగీ పాలనలోనూ రైతులను జైళ్లలో పెట్టరు
- ఖమ్మం మార్కెట్ ఘటనలో రైతులపై అక్రమ కేసులను ఎత్తేయాలి
- మిర్చిని క్వింటాలుకు రూ. 12 వేల చొప్పున ప్రభుత్వమే కొనాలి
- కేంద్ర భూసేకరణ చట్టంలో మార్పులకు అంగీకరించం
సాక్షి, హైదరాబాద్: ‘ఏ లుచ్చా, లఫంగీ పాలన లోనూ రైతులను అరెస్టు చేసి, జైల్లో పెట్టరు’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులు కష్టపడి పండించిన పంటలను, ఉత్పత్తులను తగులబెట్టుకునే పరి స్థితి వచ్చిందంటే సీఎం కేసీఆర్ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజ మెత్తారు. శనివారం అసెంబ్లీలోని కమిటీహాలు లో ప్రతిపక్షనేత కె.జానారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అనంతరం జానారెడ్డితో కలసి ఉత్తమ్ కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులు తమ పంటలను తగులబెట్టు కోవాలని అనుకో రని, కానీ తెలంగాణలో అదే జరుగుతోందని, కేసీఆర్ పాలన ఎంత దారుణంగా ఉందో రైతుల అరెస్టుతోనే తేలిపోయిందని అన్నారు.
రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్.. ఫాంహౌస్ లోనో, ప్రగతిభవన్లోనో విలాసాలు చేసుకుం టున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ప్రభుత్వం మార్కెట్ యార్డులలో 144 సెక్షన్ అమలు చేసి రైతులు రాకుండా అడ్డుకోవడం కంటే దారు ణం ఉండదని విమర్శించారు. ఖమ్మం మార్కె ట్ ఘటనలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతుల కష్టాలను తీర్చడానికి రూ. 12 వేలకు క్వింటాలు చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో రైతులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారని, వారితో మాట్లాడటానికి వెళ్లిన అక్కడి శాసనసభ్యుడు, టీపీసీసీ కార్యనిర్వా హక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కనూ అరెస్టు చేశారని ఉత్తమ్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ జాగీరు కాదన్నారు. రైతులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేసి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు అష్టకష్టాలు పడు తుంటే భూసేకరణ బిల్లుకు వచ్చిన తొందరేమి టని ప్రశ్నించారు. పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టంలో మార్పులకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించదన్నారు. ఓయూలో శతాబ్ది ఉత్సవాలు జరిగితే విద్యార్థులను అరెస్టు చేశారని ఉత్తమ్ విమర్శించారు. విద్యార్థులను అరెస్టు చేసినా సీఎం హోదాలో కూడా మాట్లాడటానికి బెదిరిపోయి కేసీఆర్ పారి పోయారని ఎద్దేవా చేశారు.
రైతు సమస్యలపై చర్చించాలి: షబ్బీర్
భూసేకరణ సవరణ చట్టం పైనే అసెంబ్లీ సమావేశం అని సీఎం కేసీఆర్ చెప్పారని శాసనసమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి వెల్లడించారు. బీఏసీ సమావేశం అనంతరం వారు మాట్లా డుతూ రైతు సమస్యలపై చర్చించాలని తాము కోరినా సీఎం ఒప్పుకోలేదన్నారు. శాసనసభ లో రైతు సమస్యలపైనే చర్చించాలని డిమాండ్ చేస్తామని వెల్లడించారు. కాగా, కేంద్ర భూసేక రణచట్టం 2013 అమల్లో ఉండగా కొత్త చట్టం, దానికి సవరణ అవసరమే లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
ఉత్తమ్తో మంద కృష్ణ భేటీ
దళితులను సీఎం కేసీఆర్ మోసగి స్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వస్తే దళితులకు న్యాయం జరుగుతుంద నుకుంటే కేసీఆర్ మరింత అన్యాయం, మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ శనివారం హైదరాబాద్లో ఉత్తమ్తో భేటీ అయ్యారు. దళితులపై దాడులకు సంబం ధించిన నివేదికను ఆయనకు అందించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ దళిత సీఎం హామీ మొదలు దళితులపై దాడుల వరకు అనేక అంశాల్లో దళితులకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. దళితులకు జరుగుతున్న అన్యాయం, మోసం, ప్రభుత్వ వైఖరిపై అసెంబ్లీలోప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.