సివిల్స్ ర్యాంకర్ల మనోభావాలు...

సివిల్స్ ర్యాంకర్ల మనోభావాలు... - Sakshi


సివిల్స్ తుది ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతోపాటు ర్యాంకుల పట్ల తమ మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు ఇవీ...

-సాక్షి, హైదరాబాద్


 

ఐఎఫ్‌ఎస్‌కు వెళతా


నాకు ఫారిన్ సర్వీసెస్ అంటే ఇష్టం. ఇంటర్నేషనల్ లా అంశంలో ఆసక్తి ఉంది. అందుకే ఇండియన్ ఫారిన్ సర్వీసు (ఐఏఎఫ్‌ఎస్)ను ఎంచుకోవాలనుకుంటున్నా.



2011లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ నుంచి డిగ్రీ పూర్తి చేశా. ఆ తరువాత రెండేళ్లు ఉద్యోగం చేసి ఏడాదిపాటు సెలవు పెట్టి శిక్షణ తీసుకున్నా. అమ్మ ఛాయారతన్, నాన్న రతన్ ఇద్దరూ సివిల్ సర్వేంట్లే కావడంతో ఇంటర్వ్యూ మెళకువలను నేర్పించి ఎంతగానో తోడ్పడ్డారు.

- సాకేత రాజ ముసినిపల్లి, 14వ ర్యాంకర్

 

మళ్లీ పరీక్ష రాస్తా...

మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కొండ్రిపోలు గ్రామం. రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో ఐఏఎస్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఒకవేళ రాకుంటే మంచి ర్యాంకు కోసం మళ్లీ సివిల్స్ రాస్తా. ఓయూలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి క్యాపిటల్ ఐక్యూలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశా.    

- అదావత్ సైదులు, 1,174వ ర్యాంకు

 

పేదల సంక్షేమమే లక్ష్యం...

మొదటి ప్రయత్నంలోనే 18వ ర్యాంకుతో సివిల్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. మొదటి ఆప్షన్ ఐఏఎస్, రెండోది ఐపీఎస్. ఏ రంగంలో పని చేసినా పేదల సంక్షేమమే నా లక్ష్యం. పేదల అభ్యున్నతి కోసం అంకిత భావంతో సేవలందిస్తా.        

- సాయికాంత్ వర్మ, 18వ ర్యాంకర్

 

కష్టాలే సివిల్స్ వైపు నడిపించాయి

మాది పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవపల్లి. తల్లిదండ్రులు పడిన కష్టాలే నన్ను సివిల్స్ వైపు నడిపించాయి. వారిది వ్యవసాయ కుటుంబం. రోజుకు 8గంటలు కష్టపడి చదివా. బీటెక్ చేసినా అప్షనల్‌గా ఆంత్రోపాలజీ ఎంపిక చేసుకొని విజయం సాధించా.

- లక్ష్మీ భవ్య, 88వ ర్యాంకర్

 

దేశ సేవ కోసమే..

దేశానికి విస్తృతస్థాయిలో సేవలందించడమే లక్ష్యంగా సివిల్స్‌ను ఎంచుకున్నా. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. సీబీఐటిలో ఇంజనీరింగ్ చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరినా సంతృప్తి చెందకే సివిల్స్ వైపు అడుగులేశా.    

- రాకేష్, 122వ ర్యాంకర్

 

ఫ్యాకల్టీ నుంచి సివిల్స్‌కు..

గతంలో మూడుసార్లు ర్యాంకులు రాకున్నా నిరుత్సాహ పడకుండా సివిల్స్‌కు సిద్ధమయ్యా. హార్డ్ వర్క్, డెడికేషన్ , ఫోకస్ ఈ మూడు అంశాలపై దృష్టిపెట్టి చదివా. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే రెండేళ్లుగా ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌లో ఎకానమి, జాగ్రఫీ సబ్జెక్టులలో విద్యార్థులకు తరగతు లు బోధిస్తున్నా.     

- వీఆర్ కృష్ణతేజ, 66వ ర్యాంకర్

 

నాలుగో ప్రయత్నంలో ర్యాంక్

మాది కృష్ణాజిల్లాలోని గుళ్లపూడి అనే పల్లెటూరు. మూడో విడత పరీక్షలో 318 ర్యాంక్ సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికై ప్రస్తుతం నాగపూర్‌లో శిక్షణ తీసుకుంటున్న నాకు ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యం నాలుగో ప్రయత్నంలో నెరవేరింది.      

- గౌతమ్, 30వర్యాంకు

 

గ్రామాల్లో సేవ చేస్తా...

కలెక్టర్‌గా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. బెంగళూరులో బీటెక్ కంప్యూటర్ సైన్స్, అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశా. హైదరాబాద్‌లోని కేపీఎంజీ అనే సివిల్ సర్వీసెస్ అడ్వయిజరీ సంస్థలో పనిచేస్తూ అనుదినం ఐఏఎస్‌లతో అభిప్రాయాలు పంచుకోవటంతో నాకూ ఐఏఎస్ కావాలనే లక్ష్యం ఏర్పడింది. సివిల్స్‌లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, ఓపిక ఎంతో అవసరం.     

- గిరియప్ప లక్ష్మీకాంత్‌రెడ్డి, 21వ ర్యాంకర్

 

గురి ఎప్పుడు లక్ష్యం వైపే..

పోటీలో ఉన్న వారి గురి ఎప్పుడు లక్ష్యం మీదే ఉండాలి. అప్పుడే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుంది. బీటెక్ చేసే క్రమంలోనే సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నా. నా విజయం వెనుక  తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల ఆశీస్సులు ఉన్నాయి.

-మహ్మద్ రోషన్, 44వ ర్యాంకర్

 

ఆడియో ద్వారా పాఠాలు విన్నా

ఆడియో విని.. బ్రెయిలీ లిపిలో సివిల్స్ పరీక్షలు రాశా. మూడో ప్రయత్నంలో విజయం సాధించా. మాది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. ఓయూలో ఎం.ఎ.బిఈడీ పూర్తి చేశా. మెరుగైన ర్యాంకు కోసం మళ్లీ సివిల్స్ రాస్తా.

- స్వాతి (అంధురాలు), 796వ ర్యాంకర్

 

వినికిడి శక్తి కోల్పోయినా..

సివిల్స్ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన 22 ఏళ్ల నేహా వీరవల్లి 1221 ర్యాంకు సాధించారు. వికలాంగుల కోటాలో తనకు ఐఏఎస్ లేదా మరేదైనా మంచి సర్వీసు వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. రెండో తరగతిలో ఉన్నప్పుడు ఆమెకు బ్రెయిన్ ఫీవర్ (మెనిజైటిస్) రావడం వల్ల వినికిడి శక్తిని కోల్పోయారు.  సివిల్స్‌లో  రెండో ప్రయత్నంలో 1,221 ర్యాంకు సాధించారు.  నేహా  సాధించిన విజయం గురించి తెలుసుకున్న రాష్ట్రపతి  సోమవారం తనను కలిసేందుకు ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

 

‘ఆర్‌సీ రెడ్డి’కి టాప్ ర్యాంకులు

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ విద్యార్థులు సివిల్స్ 2015 ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించినట్లు సంస్థ డెరైక్టర్ ఆర్‌సీ రెడ్డి తెలిపారు. 100లోపు 18, 49, 66 ర్యాంకులతోపాటు మొత్తం 36 మందికిపైగా మంచి ర్యాంకులు కైవసం చేసుకున్నారని, పట్టుదల, శ్రమతో సివిల్స్‌లో విజయం సాధించొచ్చని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top