'చంద్రబాబు రెండు పేపర్లు వాడుకుంటున్నారు'

'చంద్రబాబు రెండు పేపర్లు వాడుకుంటున్నారు' - Sakshi


హైదరాబాద్: గ్రామగ్రామానా మాఫియాను ప్రవేశపెట్టిన ఘనుడు చంద్రబాబేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు మాఫియా అనే పదం ముంబైలో మాత్రమే వినబడేదని, చంద్రబాబు పుణ్యామా అని ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా ఈ పదం మార్మోగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.



టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక క్వారీల్లో అక్రమాలు పెరిగాయని ఆరోపించారు. 6 ఏళ్ల క్రితం ట్రాక్టర్ ఇసుక రూ. వెయ్యిలోపు ఉండేదని, ఇప్పుడు వేలల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీల్లో దోపిడీ జరగలేదని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఎటువంటి అక్రమాలు జరకపోతే శ్వేతప్రతాలు ఎందుకు విడుదల చేస్తున్నారని అన్నారు.



నిజాలు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు రెండు పేపర్లు వాడుకుంటున్నారని.. అవి న్యూస్ పేపర్లు, వైట్ పేపర్లు అని చెప్పారు. శ్వేతపత్రానికున్న అర్థాన్ని మార్చేసి పసుపు పత్రంగా మార్చేశారని మండిపడ్డారు. దోపిడీ, అక్రమాలను అరికట్టకుండా ప్రజలను మభ్య పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక సరఫరా ఆగిపోవడంతో నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయని, నిర్మాణ రంగ కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top