ఏపీ సచివాలయం మూసేద్దాం

ఏపీ సచివాలయం మూసేద్దాం


తెలంగాణ సర్కారుకు అప్పగిద్దాం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం

కంప్యూటర్లు, కరెంట్ ఫైళ్లతో వెలగపూడికి ఉద్యోగులు తరలింపు




సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని సచివాలయాన్ని త్వరగా ఖాళీ చేసి వెలగపూడికి వెళ్లిపోవాలని నిర్ణయించారు. సచివాలయం ఉద్యోగులందరినీ తరలించడం పూర్తి కాగానే ఆ భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించేయాలని నిశ్చయించుకున్నారు. ఇటీవల ఉద్యోగుల తరలింపుపై జరిగిన సమావేశంలో ఆయన మనసులో మాటను విని అధికార యంత్రాంగం విస్తుపోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై పది సంవత్సరాల పాటు హక్కు ఉన్నప్పటికీ ఈ ఏడాదే ఆ హక్కును వదులుకోవాలనే తరహాలో ముఖ్యమంత్రి మాట్లాడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


పది సంవత్సరాల అనంతరం కూడా అవసరం అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండవచ్చుననే భావన రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇందుకు భిన్నంగా వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో దుకాణం మూసేయాలనే ఆలోచనలో ఉండటం గమనార్హం. ఈ నెల 27వ తేదీలోగా సచివాలయ ఉద్యోగులు కంప్యూటర్లు, కరెంట్ ఫైళ్లతో వెలగపూడికి తరలివెళ్లిపోవాల్సిందిగా త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. శాఖలకు చెందిన మిగతా ఫైళ్ల తరలింపు బాధ్యతలను ఆయా శాఖల ఉన్నతాధికారులకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.


వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న సచివాలయం పూర్తి కాగానే ఏ బ్లాకులో ఏ శాఖ ఉండాలో సీఆర్‌డీఏ కేటాయింపులు చేస్తుందని ఆయన తెలిపారు. అఖిల భారత సర్వీసు అధికారులకు నివాస వసతిని రెయిన్ ట్రీ పార్కు అపార్ట్‌మెంట్లలో కల్పించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఆ అపార్ట్‌మెంట్లలోని రెండు, మూడు బెడ్ రూమ్ ప్లాట్లలో బ్యాచిలర్, కుటుంబ వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. అధికారుల నుంచి ప్రభుత్వ గెస్ట్ హౌస్ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని, మిగతా అద్దెను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆ అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కు చెందిన వ్యక్తిదే రెయిన్ ట్రీ పార్కు అపార్ట్‌మెంట్లు కావడం గమనార్హం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top