జూలై నెలాఖరులోగా నివేదిక సమర్పించండి
ఎస్టీ విచారణ కమిషన్ను ఆదేశించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: కాయతీ లంబాడా, వాల్మీకి బోయలను రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన ఎస్టీ విచారణ కమిషన్ను జూలై నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రెండు సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి, ఏ మేరకు వెనుకబడి ఉన్నాయో పరిశీలించేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.ఎస్.చెల్లప్ప నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎస్టీల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు కమిషన్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండగా, రాష్ర్టం జనాభాలో 10 శాతం వరకు ఉన్న తమకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని వివిధ గిరిజనసంఘాలు, నాయకులు కొంత కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ కమిషన్ కాలపరిమితిని ఆరునెలల చొప్పున ఇప్పటికే పలుమార్లు పొడిగించారు. కాగా, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ సుధీర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మైనారిటీ విచారణ కమిషన్ నివేదికను వచ్చే నెలాఖరులోగా సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
మరిన్ని వార్తలు