స్వీట్లు.. శుభాకాంక్షలేనా?: రాఘవులు


సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు కార్మికదినోత్సవాన్ని స్వీట్ డబ్బాలు, శుభాకాంక్షలకే పరిమితం చేశారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. కార్మిక చట్టాలను అమలు చేయకుండా, వారి హక్కులను హరించి వేస్తున్న ముఖ్యమంత్రులకు మేడే శుభాకాంక్షలు తెలిపే నైతిక అర్హత లేదన్నారు.నగరంలోని ఎంబీ భవన్‌లో జరిగిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడారు. 



కార్మిక పక్షపాతినంటూ పత్రికల్లో ప్రకటనలు గుప్పించిన కేసీఆర్, కనీస వేతనాల సలహా మండలి చేసిన సిఫారసులను 23 నెలలుగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఏపీలో కూడా విశాఖ బ్రాండిక్స్, అనంతపురం కారంపొడి కంపెనీల్లో వందలాది మంది కార్మికులను పనుల్లోనుంచి తొలగించారని చెప్పారు. పాలకుల కల్లబొల్లి కబుర్లను నమ్మకుండా ఐక్యపోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవాలన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top