ఒక్క చాన్స్ ఇవ్వరూ...
పూర్తి స్థాయిలో భర్తీ కాని వీవీ పోస్టులు
అవకాశం కోసం మెరిట్ అభ్యర్థుల ప్రదక్షిణ
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న విద్యా వలంటీర్ల (వీవీ) పోస్టుల్లో తమను నియమించాలని మెరిట్ అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో వీవీల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో జిల్లాలో 386 పోస్టుల్లో వీవీల నియామక ప్రక్రియను విద్యా శాఖ మొదలుపెట్టింది. ఈ తంతు గత నెలలోనే ముగిసినప్పటికీ.. వివిధ కారణాలతో పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. 287 పోస్టుల్లో వీవీలను నియమించారు. మరో 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్థానిక అభ్యర్థులతోనే వీటిని భర్తీ చేయాలన్నది నిబంధన . ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో అర్హులు దొరకలేదు. ఆ స్థానాల్లో తమను నియమించాలని వివిధ మండలాల అభ్యర్థులు కలెక్టర్, డీఈఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశం తమ పరిధిలో లేదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు వారికి సమాధానం ఇస్తున్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు
వాస్తవంగా వీవీ పోస్టుల భర్తీ ప్రక్రియ గతనెల 25వ తేదీలోపు ముగియాల్సి ఉంది. అభ్యర్థుల కొరత కారణంగా ఈ నెల 5 వరకూ ఇది కొనసాగింది. ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మెటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలు ఈనెల 9తోముగిశాయి. ఈ నెల 25వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు. ఆ తర్వాతనైనా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుల కొరతతో ఇప్పటికే బోధనకుంటుపడుతోంది. డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం లేదని ప్రభుత్వమే స్పష్టం చేసింది. ఇటువ ంటి పరిస్థితుల్లో వీవీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే.. విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు.