భవనాల అనుమతులు 48గంటల్లో
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో తనిఖీలు
- జాప్యం చేస్తే బాధ్యులైన అధికారులపై పెనాల్టీలు
- భవన నిర్మాణ నిబంధనలకు సవరణలు చేయనున్న ప్రభుత్వం
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల్లో భాగంగా నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల జారీ విధానంలో భారీ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. కొత్త పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులు జారీ చేసేందుకు తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ పాలసీ తరహాలోనే భవన నిర్మాణ అనుమతుల జారీలో సైతం త్వరలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టబోతోంది. భవన నిర్మాణ అనుమ తుల కోసం దరఖాస్తు చేసుకుని టౌన్ప్లానింగ్ అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితికి ఈ కొత్త సంస్కరణలు చెక్ పెట్టనున్నాయి. ఈ సంస్కరణల అమలులో భాగంగా.. భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే అనుమతులు జారీ చేయాలన్న నిబంధనలను అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే భవన నిర్మాణానికి ప్రతిపాదించిన సైట్లో తనఖీలు పూర్తి చేయాలనే నిబంధనను కూడా ప్రవేశపెట్టనుంది.
జాప్యం చేస్తే పెనాల్టీలు..
పరిశ్రమలకు అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులపై పెనాల్టీలు విధించే నిబంధన లను ఇప్పటికే ప్రభుత్వం టీఎస్–ఐపాస్ విధా నంలో ప్రభుత్వం పొందుపరిచింది. అదే తర హాలో పెనాల్టీ నిబంధనలను రాష్ట్ర భవన నిర్మాణ నిబంధనల్లో పొందుపరచాలని సూత్ర ప్రాయం గా నిర్ణయించింది. దరఖాస్తుకు 48 గంటల్లో అనుమతుల జారీపై నిర్ణయం, 24 గంటల్లో తనఖీలు, జాప్యం జరిగితే బాధ్యులైన అధికారు లపై పెనాల్టీలు విధించడం ద్వారా భవన నిర్మాణ అనుమతుల జారీని సరళీకృతం చేసేం దుకు కసరత్తు చేస్తోంది. భవన నిర్మాణ నిబంధనలను ప్రకటిస్తూ 2012లో జారీ చేసిన ఉత్తర్వు ల (జీవో నం.168)ను సవరిస్తూ త్వరలో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. పురపాలక మంత్రి కేటీఆర్ ఈ ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోద ముద్ర వేయడంతో ఒకటిరెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. సరళీకృత వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సంస్కరణల్లో భాగం గా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
సాధ్యాసాధ్యాలపై అనుమానాలు
ప్రస్తుతం అమల్లో ఉన్న మునిసిపల్ కార్పొ రేషన్లు, మునిసిపాలిటీల చట్టం ప్రకారం దరఖాస్తుకు 60 రోజుల్లో భవన నిర్మాణ అనుమతుల జారీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని టౌన్ప్లానింగ్ విభాగాల్లో అధికారులు, సిబ్బంది కొరత, అవినీతి కార ణంగా అనుమతుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తుకు 24 గంటల్లోపు తనఖీలు, 48 గంటల్లోపు అనుమతుల జారీకి ప్రస్తుతం ఉన్న టౌన్ప్లానింగ్ సిబ్బంది ఏమా త్రం సరిపోరని పురపాలక శాఖ అధికార వర్గా లు అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో 25 అంతస్తులు, ఆపై ఎత్తుగల భవనాల నిర్మాణానికి సంబంధించిన సైట్లలో కేవలం 24 గంటల్లో తనిఖీలు చేయడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో రాష్ట్రం సాధించిన నంబర్ వన్ ర్యాంకును నిలుపుకు నేందుకు ప్రభుత్వం ఈ సంస్కరణలు తీసుకువ స్తోందని, అయితే అమలు కాగితాలకే పరిమిత మయ్యే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది.